ఒక పవిత్ర బ్రాహ్మణుని కుమార్తె అట్లపైని ఆవపువ్వు నోము నోచింది. అందువలన ఆమెకు భర్త చనిపోయాడు. సంతాన నష్టమూ కలిగింది. ఆ బాధ భరింపలేక పోయింది. అడవికి పోయింది. అక్కడ ఏడవసాగింది. ఆ సమయాన పార్వతీ పరమేశ్వరు లిద్దరూ అలా వస్తూ “అమ్మా! ఎందుకలా ఏడుస్తూన్నావు? అని అడిగారు. “అయ్యా! మీరు నా యేడుపు తీర్చలేరు. నా దారిని పోండి, అనగా! వారు ‘దీనికి యింకా మంచిరోజులు రాలేదు. మనమేమి చేయగల’మని వెళ్ళిపోయారు.
ఆమె మాత్రం అలాగే అరణ్యంలో యేడుస్తూ తిరుగుతూనే ఉంది. మరి కొంత కాలానికి వారు తిరిగి అక్కడికే వచ్చారు. అప్పటి లాగే యెందుకిలా యేడుస్తున్నా”నని అన్నారు. అయ్యా ఇదంతా నాకర్మ మీరు వెళ్ళండి” అనగా ఓహె! యీమెకింకా చెడ్డకర్మ పోలేదు, అని వెళ్ళిపోయారు.
ఆమె అరణ్యంలో చెట్టులూ, పుట్టలూ తిరుగుతూ యేడుస్తున్నది. పార్వతీ పరమేశ్వరులు మరల అచ్చటికి వచ్చారు. ‘ఏమమ్మా! అలాగే యేడుస్తూ తిరుగు చున్నావా? అనగా! అమ్మా! అయ్యా! నా కడుపులో పుట్టిన పిల్లలు చనిపోయారు తలమీద గొడుగ్గా ఉన్న భర్త పోయాడు. అందువలన యిలా మతిలేక తిరుగు చున్నాను అనెను. చూడమ్మా! నీవు పూర్వం అట్లమీద ఆవపువ్వుల నోముపట్టి దానిని పాడుచేశావు. యిప్పుడు నీ యింటికి వెళ్ళి ఆనోము యొక్క కథ చెప్పికొని అక్షతలు తలపైని వేసికొని వ్రతాన్ని పూర్తి చేయవలెనని, పార్వతీ పరమేశ్వరు లిద్దరూ చెప్పారు. ఆ ప్రకారంగా ఆమె తన యింటికి వెళ్ళి ఆ నోము దీక్ష ఒక సంవత్సరం పట్టి తరువాత ముగింపుచేసెను.
దీనికి ఉద్యాపనమూ లేక ముగింపు ఒక పుణ్యస్త్రీకి తలంటి నీళ్ళు పోసి జాకెట్టు బట్ట తాంబూలములుతో దక్షిణ యిచ్చి నెలకొకటి చొప్పన పన్నెండు అట్లు నేయీ, బెల్లముతో వాయినం ఆ ముత్తయిదువుకు యియ్యాలి. భక్తితో ఆమె పాదాలకు నమస్కారం చేయాలి. అలా చేస్తే భర్తతో సంతానంతో మూడు పువ్వులు ఆరుకాయలు లాగ సంసార ముంటుంది.