స్థలపురాణం: సీతను బందీగా ఉంచడాన్ని రావణుని సోదరుడు విభీషణుడు తీవ్రంగా వ్యతిరేకించాడు. వెంటనే రాముని వద్దకు వెళ్లి ఆశ్రయం పొందుతాడు. యుద్ధంలో రావణుడిని శ్రీరాముడు సంహరిస్తాడు.
విభీషణుడు తనకు చేసిన సాయానికి గుర్తుగా రంగనాథుని విగ్రహాన్ని రాముడు ప్రదానం చేస్తాడు. అయితే విభీషణుడు అసురుడు.
దీంతో దేవతలు రంగనాథ విగ్రహం శ్రీలంకకు చేరుకోకుండా అడ్డుకోవాలని నిర్ణయిస్తారు.
ఇందు కోసం గణపతిని ప్రార్థిస్తారు.
స్వామి ప్రత్యక్షమై వారి కోరికను తీరుస్తానని మాట ఇస్తారు. విభీషణుడు తిరుచ్చి సమీపంలో విగ్రహాన్ని తీసుకువెళుతుండగా కావేరి నది కనిపించడంతో పుణ్యస్నానం చేయాలని భావిస్తాడు. అయితే విగ్రహాన్ని నేల మీద పెడితే శాశ్వతంగా అక్కడే ఉండిపోతుంది.

దీంతో అక్కడే పశువుల కాపరియైన బాలుడిని సాయం కోరుతాడు. కొద్ది సమయం మాత్రమే తాను విగ్రహాన్ని పట్టుకుంటానని సమయం ముగిసిన తరువాత భూమిపైన పెట్టివేస్తానని బాలుడు చెప్పడంతో అందుకు అంగీకరించిన విభీషణుడు విగ్రహాన్ని అతనికి అందజేస్తాడు.
బాలుని రూపంలో ఉన్నది సాక్షాత్తు వినాయకుడు కావడం విశేషం. కొద్ది సేపటికే గణపతి శ్రీరంగనాథ స్వామి విగ్రహాన్ని భూమిపైన పెట్టడంతో నదిలో ఉన్న విభీషణుడు ఆగ్రహించి పరుగున ఒడ్డుకు వచ్చాడు.
అయితే స్వామి విగ్రహాన్ని అక్కడ నుంచి తీయడం సాధ్యం కాలేదు.
దీంతో ఆగ్రహంతో బాలుడిని పట్టుకోవాలని చూస్తాడు. దీంతో బాలుడు వెంటనే పారిపోతాడు. అతన్ని పట్టుకోవాలని పరుగెత్తడం ప్రారంభించాడు.
చాలాదూరం పరుగెత్తిన వినాయకుడు ఒక కొండపైకి వెళతాడు. చివరకు అతన్ని పట్టుకున్న విభీషణుడు నుదుటిపై గట్టిగా కొట్టడంతో స్వామి నవ్వుతూ అసలు రూపంతో దర్శనమిస్తాడు.
విభీషణుడు వెంటనే క్షమాపణలు కోరుకోవడంతో గణపతి అతనిని ప్రసాదించి శ్రీరంగనాథస్వామి కావేరి తీరంలోనే ఉంటారని వెల్లడిస్తాడు. అనంతరం వినాయకుడు అక్కడే స్వయంభువుగా వెలసినట్టు తెలుస్తోంది. |