
sri kapileswara swamy pavithrotsavam
1. శ్రీ కపిలేశ్వరస్వామి పవిత్రోత్సవాలు
ప్రతి సంవత్సరం ఆషాఢమాసంలో పున్నమి ముందు ఉన్న చతుర్దశినాటికి పూర్తయ్యేటట్లు మూడురోజుల పాటు శ్రీకపిలేశ్వరస్వామిక్షేత్రంలో పవిత్రోత్సవాలు జరుగుతాయి. ఏడాది పొడవునా, శ్రీకపిలేశ్వరస్వామి-ఆలయంలోనూ, అర్చనాది కార్య క్రమాల్లోనూ, జరిగే ఉత్సవాల్లోనూ, పుష్కరిణి తీర్థ పరిసరాల్లోనూ ఇలా ఆ క్షేత్రం అంతటా తెలిసికొన్ని, తెలియక కొన్ని దోషాలు, లోపాలు జరుగుతుంటాయి. జరుగుతాయి కూడా. ఇలాంటి దోషాలు అర్చక పరివారం, ఆలయ సిబ్బంది మాత్రం చేతనే కాక, యాత్రికుల వల్ల కొంత సంభవిస్తుంటాయి. దీని వల్ల ఎప్పటికప్పుడు ఆలయ పవిత్రతకు ఏ మాత్రం లోపాలు కలగకుండా, భంగం వాటిల్లకుండా, ఆలయ పవిత్రీకరణం కోసం శాస్త్రోక్తంగా జరిగే ఉత్సవాలే పవిత్రోత్సవాలు.
ముందుగా ఆషాఢ ఏకాదశి నాటి ప్రదోషకాలంలో పవిత్రోత్సవాలకు మృత్సంగ్రహం, పిదప అంకురార్పణ కార్యం జరుగుతుంది.
ఆ మరునాడు హోమాది కార్యక్రమంలో శైవాగమ శాస్త్రోక్తంగా అందరి దేవతలను కలశాలలో ఆవాహన చేసి ప్రతిష్ఠిస్తారు. పిదప పవిత్రాల ప్రతిష్ఠ జరుగుతుంది.
రెండవనాడు ఆ పవిత్రాలను ఆలయంలో శ్రీకపిలేశ్వర మూలలింగం మొదలు కొని, కపిలేశ్వర మూలమూర్తులకు, ఉత్సవమూర్తులకు, ధ్వజస్తంభ బలిపీఠాలకు, ఆలయశిఖరాలకు సమర్పింపబడుతుంది.
మూడవ నాడు పూర్ణాహుతి. అది ఈ సంవత్సరం జూలై 24 నుండి 26వ తేదీ వరకు జరుగుతాయి.