శరణు శరణు అయ్యప్ప శ్రీ స్వామీ శరణమయ్యప్ప.!! Swamy Saranam Ayyappa

0
3654

12274571_327514574085784_5654221333134729797_n

అయ్యప్ప దీక్ష నియమావళి

దీక్షా సమయంలో అయ్యప్పలు పాటించవలసిన నిత్యనియమావళి :-

1. ప్రతిదినము ఉదయమే సూర్యోదయమునకు ముందుగా మేల్కొని కాల కృత్యములు తీర్చుకుని, చన్నీళ్ళ శిరస్నానం ఆచరించి, స్వామికి దీపారాధన గావించి, స్వామి స్తోత్రములు పఠించి తరువాతనే మంచి నీరైనను త్రాగాలి. సాయంత్రము వేళ కూడా చన్నీళ్ళ శిరస్నానం చేసి, స్వామికి దేవతార్చన జరిపి, రాత్రిపూట భిక్ష చేయాలి.

2. రోజూ ఉదయం, సాయంత్రం ఏదో ఒక దేవాలయమును దర్శించాలి.

3. నల్లని దుస్తులు మాత్రమే ధరించాలి.

4. కాళ్ళకు చెప్పులు లేకుండా తిరగాలి.

5. మెడలో ధరించిన ముద్రమాలను ఎట్టిపరిస్థితిలోనూ తీయరాదు. అయ్యప్ప సాన్నిధ్యము చేరుటకు కనీసము 41 రోజులు ముందుగా దీక్ష ఆరంభించాలి.

6. దీక్ష కాలమందు గడ్డము గీసుకొనుటగాని క్షవరం చేయించుకొనుట గాని పనికి రాదు. గోళ్ళు కూడా కత్తిరించకొనరాదు.

7. అస్కలిత బ్రహ్మచర్యము పాటించుతూ యోగిగా జీవించుట అయ్యప్పకు ఎంతో అవసరము. ఇంటిలో ఒక వేరు గదిలో వుండుట శ్రేయస్కరము. దాంపత్యజీవితము మనోవాక్కాయకర్మములందు తలచుట కూడ అపరాధము.

8. మెత్తటి పరుపులు, దిండ్లు ఉపయోగించరాదు. నేల మీద కొత్త చాప పరచుకొని పరుండట ఉత్తమము.

9. అయ్యప్పలు శవమును చూడరాదు. బహిష్టయిన స్త్రీలను చూడరాదు. అట్లు ఒకవేళ చూసిన యెడల ఇంటికి వచ్చి, పంచగవ్య శిరస్నానమాచరించి, స్వామి శరణు ఘోష చెప్పిన పిదపనే మంచి నీరైనా త్రాగవలెను.

10. దీక్షలో ‘స్వామియే శరణమయ్యప్ప’ అనే మూల మంత్రమును ఎప్పుడూ జపించవలెను.

11. దీక్షా సమయంలో స్త్రీల నందరిన్నీ (భార్యతోసహా) దేవతామూర్తులుగా భావించాలి.

12. తమ పేరు చివర ‘అయ్యప్ప’ అని పదము చేర్చాలి. ఇతరులను ‘అయ్యప్ప’ అని పిలవాలి. స్త్రీ అయ్యప్పలను ‘మాలికాపురం’ లేదా ‘మాతా’ అని పిలవాలి.

13. అయ్యప్పలను ఎవరైనా భిక్షకు (భోజనమునకు) పిలిస్తే తిరస్కరించరాదు.

14. అయ్యప్పల నుదుట ఎప్పుడు విభూధి, చందనము, కుంకుమ బొట్టు ఉండాలి.

15. మద్యము సేవించుటగాని, పొగాకు పీల్చుట వంటి దురలవాటు మానుకొనవలెను. తాంబూలం కూడా నిషిద్ధమే.

16. రోజు అతి సాత్వికాహారమునే భుజింపవలెను. రాత్రులందు అల్పాహారము సేవించవలెను.

17. తరచూ భజనలలో పాల్గొనుట అత్యుత్తము. స్వామి శరణు ఘోష ప్రియుడు కాబట్టి ఎంత శరణు ఘోష జరిపితే స్వామికి అంత ప్రీతి.

18. హింసాత్మక చర్యలకు దూరముగా వుండాలి. అబద్దమాడుట, దుర్బాషలాడుట చేయరాదు. అధిక ప్రసంగములకు దూరముగా వుండాలి.

19. ప్రతి దినము స్వామికి అర్చన చేసి, తర్వాత ఇష్టదైవమును ప్రీతికొద్ది ధ్యానించాలి.

20. అష్టరాగములు, పంచేంద్రియములు, త్రిగుణములు, విద్య, అవిద్యలకు దూరముగా వుండాలి. ఇదే పదునెట్టాంబడి.

21. శక్తి కొలది దీక్షా సమయములో కనీసము ఒకసారైనా నల్గురు అయ్యప్పలకు భిక్ష పెట్టుట మంచిది.

22. స్వామి వారికి కర్పూరం ప్రీతి కనుక ఉదయం, సాయంత్రం కూడా కర్పూర హారతి ఇవ్వాలి.

23. దీక్షా సమయంలో వయస్సు, హోదా, అంతస్తు సర్వము మరచి సాటి అయ్యప్పలకు పాదాభివందనము చేయుటకు వెనుకాడరాదు. దీక్షా సమయంలో తల్లిదండ్రులకు పాదాభివందనము చేయవచ్చును. కానీ దీక్షలేని ఇతరులకు పాదాభివందనం చేయరాదు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here