భవిష్యోత్తర పురాణం లో శ్రీకృష్ణుడు ధర్మరాజుకు వరూధినీ ఏకాదశి వ్రత మహిమను గురించి చెబుతాడు. ‘ధర్మరాజా వరూధినీ ఏకాదశి వ్రతం పాటించడం వలన స్త్రీలు మాంగల్య బలాన్ని పొందుతారు. పురుషులు సత్ప్రవర్తననూ, సంఘం లో గౌరవాన్నీ, ధన సంపదలనూ పొందుతారు. అంతే కాదు వరూధినీ ఏకాదశి వ్రతం ఆచరించడం పదివేల సంవత్సరాలు తపస్సు చేయడం తో సమానమైనది. సూర్య గ్రహణ సమయం లో సువర్ణదానం చేసినంత పుణ్యం లభిస్తుంది. మాంధాత వరూధినీ ఏకాదశిని పాటించడం వలనే కష్టాలనుండీ బయటపడ్డాడు. ‘ అని స్వయంగా కృష్ణ భగవానుడే వరూధిని ఏకాదశి మహిమను కొనియాడాడు.
ఏకాదశి రోజున ఉపవసించి, దైవదర్శనం చేసుకుని జాగరణను పాటించేవారు ఇహలోకం లో సకల శుభాలనూ పొందగలరు. వారికి పరలోకం లోనూ సద్గతులు సంప్రాప్తిస్తాయి.
వరూధినీ ఏకాదశి రోజున కుంభమేళా స్నానం చేసిన వారికి విశేషఫలితాలు లభిస్తాయి. కుంభమేళా సమయం లో వచ్చే వరూధినీ ఏకాదశిని ప్రజలు అత్యంత వైభవంగా జరుపుకుంటారు.
2. ఏకాదశి వ్రతం ఎలా ఆచరించాలి..?
శ్రీ మహావిష్ణువుకి ప్రీతికరమైన ఏకాదశి రోజున ఉదయాన్నే అభ్యంగన స్నానాన్ని ఆచరించి. విష్ణు సహస్ర నామ పారాయణ చేయాలి. ఉపవాస దీక్షను పాటించాలి. ఏకాదశి రోజున హరినామ స్మరణం సకలపాప హరణం. అన్యమైన విషయాలలో మనస్సును చలించనీయక ఏకాగ్ర చిత్తం తో స్వామిని అర్చించాలి. ఉపవాస దీక్షలో పాలు పళ్ళు భుజించ వచ్చు. ఆరోగ్యం సరిగా లేని వారు, చిన్న పిల్లలు వృద్ధులు ఉపవాసం చేయకపోయినా అపచారం కాదు. నేడు వైష్ణవాలయాలలో ఉత్తరద్వార దర్శనం చేసుకొని స్వామిని మనసారా ధ్యానించాలి.